vehicle-registration-new-changes-may-2026

vehicle-registration-new-changes-may-2026

Vehicle Registration: ఈ కొత్త విధానం ప్రకారం, డీలర్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించిన తర్వాత రవాణా అధికారులు 24 గంటల్లోగా పరిశీలించి ఆమోదించాలి. శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబరు జనరేషన్ కూడా ఆ గడువులోనే పూర్తి కావాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వాహనదారులకు పెద్ద గుడ్ న్యూస్ అందించింది. ఇకపై కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) ప్రక్రియను కేవలం 24 గంటల్లోనే పూర్తి చేసే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు జీవో జారీ చేశారు. ఈ నిర్ణయం వాహనదారులు, డీలర్లు, ఆటోమొబైల్ రంగం మొత్తానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారని సూర్య రిపోర్ట్ చేసింది.

ప్రస్తుతం కొత్త వాహనం కొన్న తర్వాత డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసి, శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేస్తారు. ఈ ప్రక్రియలో జాప్యాలు, బ్యూరోక్రసీ కారణంగా వారాల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. కానీ కొత్త విధానం ప్రకారం, డీలర్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించిన తర్వాత రవాణా అధికారులు 24 గంటల్లోగా పరిశీలించి ఆమోదించాలి. శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబరు జనరేషన్ కూడా ఆ గడువులోనే పూర్తి కావాలి. ఫ్యాన్సీ నంబర్లు కోరుకునే వాహనాలకు మాత్రం ఈ 24 గంటల నియమం వర్తించదు.

ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా కొత్త బైక్‌లు, కార్లు కొనుగోలు చేసే మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. వాహనం కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవడంతో బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్ అప్‌డేట్, ఫాస్టాగ్ యాక్టివేషన్ వంటి సేవలు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అంతేకాదు డీలర్లపై ఉండే పెండింగ్ ఒత్తిడి కూడా తగ్గనుంది.

రవాణా శాఖ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఆమోదాలు ఇచ్చే విధంగా సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆదివారం లేదా ప్రభుత్వ సెలవు వచ్చినా ప్రజలకు సేవలు ఆగిపోవు. పూర్తిగా డిజిటల్ విధానంలో పారదర్శకంగా ఈ ప్రక్రియ సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ-గవర్నెన్స్, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం పెరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం పరిపాలనా సంస్కరణల్లో మరో ముందడుగుగా భావిస్తున్నారు. ముఖ్యంగా “సమయపాలన – ప్రజలకు త్వరిత సేవలు” అనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుండగా, వాహనదారులు కూడా అవసరమైన పత్రాలు సరిగా సమర్పిస్తే ఒకే రోజులో శాశ్వత రిజిస్ట్రేషన్ పొందే అవకాశం కలగనుంది. దీంతో రవాణా శాఖలో పెండింగ్ ఫైళ్లకు చెక్ పడటంతో పాటు ప్రజలకు మరింత సులభమైన సేవలు అందనున్నాయి.

FOR MORE DETAILS CLICK HERE